Pahalgam terror attack - India, Pakistan relations.

Pahalgam terror attack - India, Pakistan relations. 


 Rama Sundari · 

పహల్గావ్ లో దాడి జరగగానే ఇండియా ముందు సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సింధూ నదీ జలాల ఒప్పందం ఇండియా పాకిస్తాన్ ల మధ్య 1960లో జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే. దాడికి బాధ్యత వహించాల్సిన వాళ్లు ఆ పని చేయకుండా పాకిస్తాన్ కు నీళ్లు ఆపేస్తామని చెబితే ముందు భారతదేశ సామూహిక ఆత్మ సంతృప్తి పడుతుంది. పిచ్చి జనాలు వీరంగాలు వేస్తూ ఉంటారు. ‘వేట మొదలైయ్యింది. చచ్చారు నా కొడుకులు’ అంటూ RTV లాంటి వేలాది యు ట్యూబు ఛానళ్లు వ్యూస్ కోసం కిందా మీదా పడతాయి.     

మనలో కూడా చాలమందిమి ముందు పనిలో పనిగా పాకిస్తాన్ ను ఖండించి పారేసి మన దేశభక్తిని చాటుకొన్నాం. కశ్మీర్ దాడులు జరిగినపుడల్లా పాకిస్తాన్ ను ఖండించటం మన సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని తూచా తప్పక పాటించాలి. 

మనకు చాలా షార్ట్ మెమొరీ కూడా. పుల్వామా గుర్తుకు రాదు. ఎప్పుడో 2019లో కదా జరిగింది. దానికి సంబంధించిన నిజాలు తరువాత నాలుగైదు ఏళ్ల దాకా బయటకు వస్తూనే ఉన్నా ఎక్కడ గుర్తు ఉంటుంది? పార్లమెంటు దాడి నాటకం ఆడించి, అఫ్జల్ గురును బలి చేసిన ధవీందర్ సింగ్ తరువాత ఒక ఆటంకవాది అని చెబుతున్న వ్యక్తి కారులో ఆయుధాలతో సహా పట్టుబడటం కూడా గుర్తుకు రాదు. ఫుల్వామ ఘటన జరిగినపుడు కోట్ల ఖర్చుతో బాల్ కోట్ దగ్గర సర్జికల్ దాడుల డ్రామా ఆడి ఒక కాకిని మాత్రం చంపగలిగామనీ, అభినందన్ వర్తమాన్ ను పాకిస్తాన్ దయా దాక్షిన్యాలతో వెనక్కు తెచ్చుకోగలిగామని ఎక్కడ గుర్తు ఉంటుంది? మన జ్నాపక శక్తి మీద అపారమైన నమ్మకం వాళ్లది. అందుకే ప్లాన్ కొద్దిగానే మార్చి మిలటరీ ప్రతీకార నాటకాలు కాకుండా నీళ్లు ఆపుతామని సివిల్ రివెంజ్ ప్రకటించారు.

పాకిస్తాన్ నోట్లో వేలు పెట్టినా కొరకలేని దేశమని నేను అనటం లేదు. సమయం వస్తే భారత్ కు వ్యతిరేకంగా ఏమి చేయాలో అది చేయటానికే ఆ దేశం ప్రయత్నిస్తుంది. పాకిస్తాన్ లో విముక్తి పోరాటాలు చేస్తున్న బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి మనం పెట్టుబడులు పెట్టి, శిక్షణ ఇచ్చినట్లుగానే -వాళ్లూ ఐదు తరాలుగా విముక్తి కోసం పోరాడుతున్న కశ్మీరీల అసహాయతను భారతదేశానికి వ్యతిరేకంగా వాడుకొంటున్నారు. అంతకు మించి పాకిస్తాన్ కశ్మీరీలకు చేసింది ఏమీ లేదు. మనం పాకిస్తాన్ తాలిబాన్స్ కు సాయం చేసినట్లుగానే అది. కుట్ర చేసి ఇటీవల కెనడాలో -అక్కడి పౌరుడు, ఖలిస్తాన్ నాయకుడైన హర్దీప్ సింగ్ నిజ్జార్ ను చంపేసి, కెనడా ప్రభుత్వం చేత వెళ్లగొట్టిచ్చుకొన్నాం కదా. అలా అన్న మాట. 

ఇతర దేశాల అంతరంగిక విషయాల్లో, అసంతృప్తుల్లో వేళ్లు పెట్టని నేషనల్ స్టేట్స్ ఉన్నాయా? బలోచిస్తాన్ విముక్తి పోరాటం ఎంత న్యాయమయినదో, కశ్మీరీల పోరాటం కూడా అంత న్యాయమైనదే. అమెరికా సహాయం చేసిన కుర్ధిష్ పోరాటం కూడా అలాంటిదే. అమెరికా నుండి ఆయుధ సహాయం తీసుకొన్నంత మాత్రాన అది మలినమై పోదు. వాళ్ల cause పలుచనై పోదు. 

సమస్యంతా అసలు సమస్యే లేదన్నట్లు చేసే నటనలోనే ఉంటుంది. ఏడు లక్షల సైన్యం, అనేక గూఢాచారి, నిఘా వ్యవస్థలు అక్కడ చేస్తున్న పని ప్రజలను బాదటం. చంపటం. అదృశ్యం చేయటం. దేశ సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యాలు ఊళ్లల్లో తిష్ట వేసి స్థానికులను వేధించటం తప్ప ఇంకో పని చేయటం లేదు. ఆల్ ఈజ్ వెల్ అంటూ ప్రకటనలు గుప్పించి కశ్మీర్ వైపు జనాల్ని తోసి అతి పెద్ద ముస్లిం స్టేట్ మా ఆధీనంలోకి వచ్చిందని గొప్పలు చెప్పి అమాయక ప్రజల ఉసురు పోసుకొన్నాయి పెద్ద తలకాయలు.    

అయితే అక్కడా ఇక్కడా ప్రజల మాటేమాటేమిటి? భారత దేశపు ఛానల్లు ఓండ్ర పెడుతుంటే -ఒక పాకిస్తానీ ఫేస్ బుక్ లో డెస్పరేట్ గా ఇలా రాశాడు. ‘మేము ఇప్పటికే మా దేశం చేతిలో బాధితులమ్. ఇండియా కొత్తగా మమ్మల్నేదో చేస్తుదనుకోవటం హాస్యాస్పదం. నీళ్లు ఆపుతారా? అవి ఎటూ రావటం లేదు. చంపుతారా? మా దేశం ఇప్పటికే మమ్మల్ని చంపేస్తుంది. లాహోర్ ని తీసేసుకొంటారా? తీసుకోండి. అర్ధ గంటలో తిరిగి ఇచ్చేస్తారు.’




రాజ్యాల చేతిలో ఆయుధాలుగా జలాలు

రమాసుందరి 

మొదటి భాగం  

సింధు జలాల వివాదం గురించి చదువుతుంటే కొన్ని విషయాలు తెలిసాయి. రాజ్యాలు నీళ్లను దేశాల మీదా, దేశ ప్రజల మీద ఎలా ఆయుధంగా ఎలా ఉపయోగిస్తాయో పాలస్తీనా విషయంలో విన్నాను కానీ, సాక్షాత్తు భారత ఉపఖండంలోనే అలా జరిగిందని చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది.

ఇండియా పాకిస్తాన్ విభజన జరిగిన తరువాత నదుల పంపకం జరిగి సట్లెజ్, రవి, వ్యాస్ నదులు మనకూ; సింధు, చెనాబ్, జీలం నదులు పాకిస్తాన్ కూ ఇస్తూ వరల్డ్ బాంక్ ఆధ్వర్యంలో పంపంకాలు జరిగాయని అందరికీ తెలుసు. భారత్ పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతలు వచ్చినప్పుడల్లా ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తామని భారత్ ప్రకటించటం కూడా తెలుసు. ఇప్పుడు కూడా మళ్లీ అదే పాట పాడుతున్నారు. నీటి వాలు పాకిస్తాన్ వైపు ఉంటుంది కాబట్టి, ఆ నీళ్లను ఆపటం కుదరదనీ వాదించేవాళ్లు ఉన్నారు. కానీ అది వాస్తవం కాదు. 

సింధూ లోయ నాగరికత కాలం నుండీ నీటి జలాలు -బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంకలతో కూడిన భారత ఉపఖండంలో -ఒక ముఖ్య పాత్ర వహించాయి. సింధు నాగరికత కూడా అక్కడి ప్రజలకు జీవన వనరుగా ఉన్న సింధు నది ఒడ్డునే జరిగింది. నీటిని నిలిపి ఉంచే సాంకేతికత, నీటిపారుదల పద్దతులు ఉన్నత స్థాయిలో ఉండటం వలనే ఈ నాగరికత వేల సంవత్సరాలు మనగలిగింది. తరువాత కాలంలో భారతదేశాన్ని పరిపాలించిన బౌద్ధులు, జైన్ లు -వ్యవసాయం కోసం రిజర్వాయర్లను కట్టటం ఈ నాగరికత నుండే నేర్చుకొన్నారు. 

తరువాత జరిగిన హిందువుల పాలనలో హిందూ నీటి జలాల చట్టాల్లో మనువు సూత్రాలు ముఖ్యపాత్ర వహించాయి. వ్యక్తిగత అవసరాలకు నీటిని మళ్లించటాన్ని ఈ సూత్రాలు నిషేదించాయి. కౌటిల్యుడు రాసిన అర్ధశాస్త్రంలో నీళ్లు రాజుకు మాత్రమే చెందుతుందనీ రాశారు. ప్రజల మీద వేసే కఠిన నీటి పన్ను విధానం గురించి కూడా అందులో రాసి ఉంది. అయితే ఇతరలకు కీడు చేయటానికి నీటిని వాడకూడదనీ, ఆనకట్టల నుండి నీటిని విడుదల చేసేటపుడు దిగువ ప్రవాహంలో, ఎగువ ప్రవాహంలో నివసించే వారిని జాగురుత పరచాలనీ కూడా రాసి ఉంది. నీటి విడుదల వలన జరిగే నష్టాన్ని నీరు విడుదల చేసినవాళ్లే భరించాలని, జల దారులను రవాణాకు, వ్యాపారానికి వాడవచ్చునని కూడా అర్ధ శాస్త్రంలో ఉంది. 10వ శతాబ్దంలో ముస్లిం పాలన ప్రారంభం అయ్యాక,16వ శతాబ్దంలోని మొఘలుల పాలనలో కూడా ఈ సూత్రాల్లో పెద్ద మార్పులు రాలేదు. హిందువులు నీటి ద్వారా పాటించే ఆచారాలను అలానే కొనసాగించటానికి అనుమతి దొరికింది. 

16వ శతాబ్దం తరువాత ఐరోపా వలస పాలనలోనే మార్పులు జరిగాయి. రవాణాకు నీటి మార్గాలను బ్రిటీష్ వాళ్లు వాడుకోవటం మొదలైయ్యింది. ఆఫ్రికా అంతటి పారిశ్రామికరణ భారత ఉపఖండంలో జరగక పోయినా ఈ పద్దతులు నీటి గుణాన్ని మొత్తంగా మార్చేశాయి. పెద్ద ఎత్తున తాగునీరు కలుషితం అయింది. అంతే కాదు, చిన్న ఎత్తున జరిగే నీటి పారుదల వ్యవసాయం దెబ్బతిన్నది. రైతుల నడ్డి విరిగింది. 

1857 ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం వరకు బ్రిటిష్ వాళ్లు నీటి నియంత్రణ చట్టం మీద దృష్టి పెట్టలేదు. ఆ తిరుగుబాటు తరువాత ప్రజల మీద నీటి ద్వారా ప్రతీకారం తీర్చుకోవటం నేర్చుకొన్నారు వాళ్లు. కాలువల మీద, నీటి పారుదల మౌలిక సదుపాయాల మీద కేంద్రీకరించి నీటి నియంత్రణ గురించి వరుస చట్టాలు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. 1873లో భూగర్భ జలాలను మాత్రం వదిలేసి -నదులు, సెలయేళ్లు, చెరువుల మీద ప్రభుత్వానికి పూర్తి అధికారాన్నిచ్చే చట్టాన్ని చేసింది. అప్పటి వరకూ ప్రజల చేతిలో ఉన్న నీటి వనరులు అంచెలంచెలుగా బ్రిటిష్ రాజ్యం హక్కుబుక్తం అయ్యాయి.    

19వ శతాబ్దం మొదలు నాటికి నీటి సంబంధ వ్యాధులు కలరా, టైఫస్ లాంటివి ప్రబలి మరణాలు పెరిగాయి. దానికి కారణం తాగునీరు కలుషితం అవటం, నిలువ ఉండటమే. 1840-1900 మధ్య కాలంలో బ్రిటీష్ వాళ్లు ‘భూమ్యాకర్షణ పథకం’ అనే కొత్త ఇంజినీరింగ్ పద్దతి ద్వారా నీటి పంపిణీ చేయటం మొదట బొంబాయిలో మొదలు పెట్టారు. ఈ పద్దతి బ్రిటీష్ నగరాలను శుభ్రం చేయటానికి ఉపయోగపడింది కానీ, వలస దేశాల్లో జాతి వివక్ష ఎక్కువ పాత్ర వహించటం వలన ఈ పథకం నిర్లక్ష్యానికి గురి అయి విఫలం అయింది. బ్రిటీష్ చల్లటి వాతావరణానికి అనుగుణంగా తయారైన పైపులు భారత ఉపఖండ వేడి వాతావరణ పరిస్థితులలో తుప్పు పట్టి పోయాయి. బొంబాయికి చాలాకాలం నీళ్ల సరఫరా లేకుండా పోయింది. 

ఈ భూమ్యాకర్షణ పథకం అమలులో బ్రిటీష్ వాళ్లు ఇక్కడి స్థానిక ప్రజలను విస్థాపనకు గురి చేశారు. ఒక చోట నుండి ఇంకో చోటకు వారి నివాసాలను మార్చి -పేదలను ఇంకా దారిద్యానికి నెట్టారు. ఈ వ్యాధులు ప్రబలటానికి కారణం దోమలనీ, వాటిని అదుపు చేయటానికని చెబుతూ -బావులను, ఒకప్పటి పెద్ద పెద్ద నీటి తొట్టెలను పూడ్చివేశారు. ఇంత జరుగుతుంటే -ఎంతో కొంత ఎదిరించే స్థోమత ఉన్న హిందువులు కర్మ కాండలు నిర్వహించుకోవటానికి బావులు కావాలని పోరాటాలు చేశారు. దానికి కూడా ఒప్పుకోలేదు ఆనాటి పాలకులు. స్థానికుల ఉద్యమాలు, దాడులు, ఫిర్యాదులను బ్రిటీష్ ఏ మాత్రం పట్టించుకోలేదు. మీదు మిక్కిలి నీటి చట్టాలను చేసి నీటి మీద పూర్తి యాజమాన్య హక్కును సంపాదించుకొన్నది.



రాజ్యం చేతిలో ఆయుధాలుగా జలాలు 

రమాసుందరి 

రెండో భాగం 

దేశ విభన తరువాత 

దేశ విభజన తరువాత, హిందూ ముస్లిం నివాస ప్రాంతాలుగా ప్రజలు విడిపోయాక జమ్మూ కశ్మీర్, హైదారాబాద్, సిక్కిం లాంటి రాజ్యాలను విభజన ప్రణాళికలో చేర్చుకోలేదు. కశ్మీర్ మీద హక్కు కోసం ఇండియా, పాకిస్తాన్ లు అనేక యుద్ధాలు చేసుకొన్నాయి. రెండు దేశాలకు కశ్మీర్ లో ప్రవహించే నదులు, నీటి వనరులు కావాలి. రెండు దేశాలు హిమనీ నదాలు కరిగి (గ్లాసియర్స్) నదులుగా మారే కశ్మీర్ కావాలి. కశ్మీర్ ను స్వాధీనం చేసుకొంటే నీటిని స్వాధీనం చేసుకోవచ్చు. రెండు దేశాల్లో విద్యుత్, వ్యవసాయం, నీటి పారుదలలకు నీళ్లు కావాలి. చివరకు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను, దేశ ప్రజారోగ్యాన్ని కుంటు పరచగల శక్తివంతమైన పరికరమైన నీరు పుష్కలంగా ఉన్న కశ్మీర్ భారతదేశం చేతిలోకి -కశ్మీరీల అభిష్టానికి వ్యతిరేకంగా -వచ్చి చేరింది.

నీటి విషయంగా తాత్కాలిక సర్దుబాట్లు 1948, మార్చి 31 వరకూ జరిగాయి. ఆ రోజు గడిచిన మరురోజే తూర్పు పంజాబ్, పశ్చిమ పంజాబ్ కు నీటిని ఆపివేసింది. పాకిస్తాన్ పంజాబ్ లో ఉన్న రైతులు సంక్షోభంలో పడ్డారు. వేసవి కాలపు పంట పడలేదు. విభజన తరువాత ప్రజల కదలికలు అటూ, ఇటూ జరిగి జబ్బులు ప్రబలి ఉన్నాయి. ఎప్పుడూ లేనంతగా ఆహారం, నీటి అవసరాలు పెరిగి ఉన్నాయి. పాకిస్తాన్ కు గింజలు ఇవ్వగలిగిన పశ్చిమ పాకిస్తాన్ వ్యవసాయం భారతదేశం అదుపులో ఉన్న సరిహద్దు నుండి ప్రవహించే సట్లెజ్ నది మీద ఆధారపడి ఉంది. అప్పటికి నెహ్రూ కలగచేసుకొని పాకిస్తాన్ పంజాబ్ కాలువలకు నీళ్లు పునరుద్ధరించినా -పాకిస్తాన్ భారతదేశం మీద నమ్మకాన్ని కోల్పోయింది. 

తరువాత 12 సంవత్సరాలు అనేక ఉద్రిక్తతలు, ఘర్షణలు జరిగాక ప్రపంచబాంకు ఆధ్వర్యంలో సింధు జలాల ఒప్పందం 1960లో జరిగింది. సింధూ నది 20 శాతం నీళ్లు భారత్ కూ, 80 శాతం నీళ్లు పాకిస్తాన్ వెళ్లాలని నిర్ణయం జరిగింది. మనకి 20 శాతమేనా, ఎంతన్యాయం అని దేశభక్తులు గుండెలు బాదుకోవద్దు. ఆ 20% కూడా మనం ఎప్పుడూ పూర్తిగా వాడుకోవాల్సిన అవసరం రాలేదు. 

అయితే ఈ పంపకం న్యాయంగా జరగలేదని పాకిస్తాన్ భావించింది. నీళ్లను నిలువ ఉంచటానికి తమ వైపు నుండి పుట్టిన పశ్చిమ నదుల మీద తాము ఆనకట్టలు కట్టటానికి ప్రపంచ బాంకును ఒప్పించింది పాకిస్తాన్. దానికి భారత్ ఒప్పుకోలేదు. ఎట్టకేలకు భారత ఉపఖండంలో నీటిని శాసించే అతి పెద్ద ఒప్పందం ‘సింధూ జలాల ఒప్పందంగా’ చరిత్రలోకి ఎక్కింది. నదులను విభజించటంతో పాటు, పశ్చిమం వైపు నుండి వస్తున్న నదుల మీద భారత్ ఆనకట్టలు కట్టటానికి అనుమతి ఇచ్చింది వరల్డ్ బాంక్. అలా కట్టటం వలన నీటి భద్రపరచుకోవటం, వరదల అదుపు, వ్యవసాయం, నీటి విద్యుత్ కు ఉపయోగం ఉంటుంది భారత్ లో. పాకిస్తాన్ ఈ ఆనకట్టాల నిర్మాణానికి అభ్యంతరం చెబితే అంతర్జాతీయ మధ్యవర్తి ద్వారా చర్చలకు వెళ్లి పరిష్కరించుకోవచ్చునని కూడా చెప్పింది.  

అయితే ఈ ఒప్పందం అయినప్పటి నుండి ఇండియా, పాకిస్తాన్ ల మధ్య పదుల సంఖ్యలో అభిప్రాయ బేధాలు వచ్చాయి. వాటిలో ముఖ్యమైనది బాలీఘర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ (BHP). 2002లో నిర్మాణం మొదలు అయిన ఈ 900 మెగా వాట్ల ప్రాజెక్టు ఆనకట్ట చెనాబ్ నది మీద జమ్మూలో ప్రారంభం అయింది. 2005లో పాకిస్తాన్ BHP మీద అభ్యంతరాలు లేవనెత్తింది. దిగువ పరివాహక జలాలను ఈ ప్రొజెక్ట్ మళ్లిస్తుందనీ, పాకిస్తాన్ భూభాగపు పొలాల్లో వరదలు వచ్చే ప్రమాదం ఉందనీ చెప్పింది. సింధూ నదీ జలాల ఒప్పందంలో ఉన్న ఆర్టికల్ IX ని బయటకు తీసి, అంతర్జాతీయ మధ్యవర్తి కావాలని అడిగింది. 

స్విజర్లాండ్ ఇంజినీర్ రేమండ్ లాఫిట్టి రంగ ప్రవేశం చేసి, 20 నెలలు ఈ ప్రాజెక్టును అధ్యయనం చేశాడు. చివరికి ఈ ప్రాజెక్టు ఒప్పందాన్ని కొన్ని విషయాల్లో అతిక్రమిస్తున్నప్పటికీ -ఆనకట్టను పూర్తి చేయవచ్చునని కర్రా విరగకుండా, పామూ చావకుండా చెప్పాడు. 1950లలో రాయటం వలన ఈ ఒప్పందం భాష outdate అయిపోయిందని అన్నాడు. ఈ న్యాయం పాకిస్తాన్ కి కోపం తెప్పించింది. సింధూ జలాల ఒప్పందం జరిగింది ఆనకట్టల కోసం కాదు, నీటి వివాదాల కోసం అని ఆ దేశం చెప్పింది. ఈ ఒప్పందం న్యూట్రల్ గా లేదనీ, ఇండియా వైపు మొగ్గి వుందనీ భావించిన పాకిస్తాన్ కు గాయానికి కారం రాసినట్లు అయింది.




రాజ్యం చేతిలో ఆయుధాలుగా జలాలు

రమాసుందరి 

మూడో భాగం 

బాలీఘర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ లాగా కాకుండా వులార్ సరస్సు మీద కట్టదల్చిన టుర్బూల్ నావిగేషన్ ప్రాజెక్ట్, అంతర్జాతీయ మీడియటర్లు లేక 40 ఏళ్లుగా ఆగిపోయింది. కశ్మీర్ లో ప్రవహిస్తున్న జీలం నది నుండి తయారైన ఉలార్ సరస్సు నీటి పరిణామాన్ని అదుపు చేయటానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్ 1984 నుండి ప్రతిష్టంభనకు గురి అయింది. 

పాకిస్తాన్ కు సమాచారం ఇవ్వకుండా మొదలైన ఈ ప్రాజెక్టు, కొన్ని వారాల తరువాత పాకిస్తాన్ దృష్టికి వచ్చి -దిగువ ప్రవాహంలోని కాలువలకు నష్టం చేస్తుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ మేరకు సింధూ జలాల కమిషన్ కు కూడా రిపోర్ట్ చేసింది. కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయినా ఆ ప్రాజెక్ట్ అలా ఆగిపోయింది. ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ కోసం కొన్న సామాగ్రి అలాగే పడి వుంది. 

అప్పటి నుండి  ఈ ప్రాజెక్టు మీద ఎన్నో చర్చలు జరిగినా ఏవీ సఫలం కాలేదు. 2012లో చివరి సారి చర్చలు జరిగాయి. బీజేపీ అధికారంలోకి వచ్చాక పాకిస్తాన్ పట్ల విధానాలు మారిన భారత ప్రభుత్వం పాకిస్తాన్ ను కిరికిరి పెట్టటానికి ఈ ప్రాజెక్ట్ మీద మళ్లీ ఆసక్తి పెంచుకొన్నది.  

కశ్మీర్ జలాల్లో 73.8 శాతం నీరు జబ్బులను కలగచేసే బాక్టీరియాతో కలుషితం అయిందని గ్రేటర్ కశ్మీర్ ఇంటిగ్రేటెడ్ డీసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ 2018లో చెప్పింది. ఈ బాక్టీరియా గాస్త్రో ఎంటెరిటీస్, టైఫాయిడ్, తీవ్ర విరోచనాలు కలగచేస్తుంది. కశ్మీర్ లోని అన్ని ప్రాంతాల జలాల్లో ఈ కలుషితం వుంది. జమ్మూ కశ్మీర్ లో పెద్ద ఎత్తున జరుగుతున్న పిల్లల మరణాలు ఈ నీటి వనరుల కలుషితం వలనే సంభవిస్తున్నాయి. పాలస్తీనా లాగానే కశ్మీర్ నీటి యంత్రాంగం దశాబ్దాల వయసు కలిగింది. అది క్రమంగా క్షీణిస్తోంది. అందువలనే ఈ నీటి కలుషితం జరుగుతోంది. వివాదాస్పద ప్రాంతం అవటం వలన నీటి మౌలిక సదుపాయల నిర్మాణం మీద అటు పాకిస్తాన్ కానీ, ఇటు భారత్ కానీ దృష్టి పెట్టలేదు. కశ్మీర్ రెండు దేశాల్లో విస్తరించి ఉందని మర్చిపోకూడదు.  

2019లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ‘పాకిస్తాన్ లో ప్రవహిస్తున్న నీటిలో మా భాగాన్ని అటు పంపకుండా ఆపి, జమ్మూ కశ్మీర్ కూ పంజాబ్ కూ వాడతాం’ అని ట్వీట్ చేశాడు. సింధూ జలాల ఒప్పందం ప్రకారం అలా చేయవచ్చు కూడా. భారతదేశం ఈ ఒప్పందం ద్వారా అందుకోవాల్సినంత నీటిని ఇప్పుడు వాడుకోవటం లేదు. కానీ నీటి వనరులను మాత్రం పూర్తి స్థాయిలో తన అదుపులో వుంచుకొన్నది. ఈ ప్రభావం పాకిస్తాన్ దిగువ పరీవాహక ప్రాంతంలో పడింది. భారత్ తీసుకొన్న నిర్ణయాలు లీగల్ గా సరైనవి అయినా అది ప్రతిస్పందించిన పద్దతి పాకిస్తాన్ లో ప్రకంపనాలు లేపింది. ఇండియా పాక్షిక స్థాయి నుండి, పూర్తి స్థాయిలో నీటిని వినియోగిస్తే పాకిస్తాన్ దిగువ ప్రవాహంలో పెద్ద మార్పు వచ్చి, పాకిస్తాన్ తీవ్ర సంక్షోభంలో పడిపోతుంది. 

కేంద్ర మంత్రి ఈ ట్వీట్ చేసిన కొన్ని నెలలకు 370 ఆర్టికల్ రద్దు అయింది. జమ్మూ కశ్మీర్ పూర్తిగా కేంద్రం  చేతిలోకి వచ్చాక, అక్కడి నీటి మీద కూడా అధికారం వచ్చింది. అంటే పాకిస్తాన్ లోకి ప్రవహిస్తున్న నీటి మీద కూడా అధికారం సంపాదించిందని వేరే చెప్పనవసరం లేదు. రెండు దేశాలు నీటి సంబంధమైన సమాచారాన్ని పంచుకోవాలని 1989లో చేసుకొన్న ఒప్పందాన్ని పునరుద్ధరించబోవటం లేదని భారత్ ప్రకటించింది. సింధూ జలాల ఒప్పందాన్ని మాత్రం కొనసాగిస్తామనే అప్పటికి చెప్పింది. కానీ ఈ రకమైన నిర్ణయాలు పాకిస్తాన్ ను సంశయంలో పడేశాయి. 1989 ఒప్పందాన్ని పునరుద్ధరించబోమని చెప్పటం అంటే  పాకిస్తాన్ కు చెప్పకుండా ఎప్పుడైనా నీటిని మళ్లించవచ్చు. వదలవచ్చు. అలా చేయటం పాకిస్తాన్ కు తీవ్రమైన పరిణామాలు కలగ చేస్తుంది. 

సింధూ జలాల ఒప్పందం ప్రకారమే జరిగినా కానీ, అలాంటి నిర్ణయాన్ని నైతికంగా ప్రశ్నించాల్సిందే.  పాకిస్తాన్ భారత్ కు కోపం తెప్పించినా, నష్టం కలగ చేసినా ఆ దేశానికి వెళ్లే నీటి సరఫరా, ఆ దేశపు ఆరోగ్యం, కోట్లాది పౌరుల భద్రతా ప్రమాదంలో పడతాయి. నీటి సరఫరాను కట్ చేయటం అంటే అసలే కుంటుపడి పడి ఉన్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం పడుతుంది. అగ్ర దేశాల చేతిలో పావుగా మారిన పాకిస్తాన్ దేశ వ్యవస్థ అసలే అస్థిరంగా ఉంది.

(ఇంకా ఉంది)




రాజ్యం చేతిలో ఆయుధాలుగా జలాలు 

రమాసుందరి 

చివరి భాగం 

ఇటు కశ్మీర్ లో క్లైమెట్ చేంజ్ వలన నీటి భౌతిక స్థితిలో పెద్ద మార్పులు వచ్చాయి. పాకిస్తాన్ లో, కశ్మీర్ లో నీటి వనరులు వసంత కాలంలో హిమనీ నదాల ద్రవీభరణ మీద ఆధారపడి ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా కశ్మీర్ ఏటా దాదాపు 15-18 మీటర్ల హిమనీ నదాన్ని కోల్పోతుంది. గత 70 ఏళ్లలో మూడు హిమనీ నదాలు (గ్లాసియర్స్) పూర్తిగా అదృశ్యం అయ్యాయి. 

ఈ ప్రభావం ఒక్క కశ్మీర్ కే కాదు. మొత్తం భారత ఉపఖండం మీద పడుతుంది. కశ్మీర్ లో (ఇండియా పాలిత కశ్మీర్, పాకిస్తాన్ పాలిత  కశ్మీర్) అంతటా పొడిగా నడుస్తున్న వానాకాలలు తీవ్రమైన నీటి ఎద్దడిని, అభద్రతను, హింసను ప్రేరేపిస్తున్నాయి. 2017-18 సంవత్సరంలో 3.2 మిల్లీమీటర్ల మంచు మాత్రమే పడింది. మామూలుగా ప్రతి ఏటా 2 అడుగుల మంచు పడాలి.  నీళ్ల ఎద్దడి, నీళ్ల భద్రత లేకపోవటం కశ్మీరీలలో ఆగ్రహం పెరుగుతోంది. 

2002లో దాల్ సరస్సు లో చేపట్టిన ప్రాజెక్టును కశ్మీరీలు వ్యతిరేకించారు. దాల్ సరస్సు నీళ్లు మనుషులు తాగటానికి ఇక పనికి రావని వాళ్ల అభిప్రాయం. తరువాత ఆ ప్రాజెక్టు దగ్గర్లోని ఇంకో తాజా నీటి సరస్సుకు మారిందనుకోండి. ఇది జరిగిన ఒక దశాబ్దానికి దాల్ లేక్ ఇంకా కలుషితం అయింది. అయినా ఇప్పటికీ ప్రజలు ఆ నీటిని గత్యంతరం లేక తాగుతూనే ఉన్నారు. కశ్మీర్ లో నీటి లభ్యత తగ్గటం వలన ఇలా జరుగుతోంది. 

పాకిస్తాన్ మీద నీటి జలాలను ఆయుధంగా ఉపయోగించటం వలన ప్రజారోగ్యం భవిష్యత్ పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కశ్మీర్ లో కూడా ఇదే జరుగుతుంది. కశ్మీర్ నీటి మీద భారతదేశపు అదుపు దీర్ఘ కాల, ప్రమాదకర ఫలితాలను ఇవ్వబోతుంది. ఇప్పటికే ఇస్తుంది. ఒకానొక కాలంలో కశ్మీర్ మొత్తం పాకిస్తాన్ కూ, భారతదేశానికి కూడా నీటిని అందించింది. కశ్మీర్ లో నీటి స్థాయిలు తగ్గిపోవటం, ఏటా ఏర్పడే హిమనీ నదాల ద్రవీకరణ అస్థిరంగా ఉండటం వలన ప్రవహించటానికి సరిపడా నీరు లేదు.  

కశ్మీర్ మీద భారతదేశం పూర్తిగా అధికారం సంపాదించటం పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నీటి ఆయుధాలను ప్రయోగించటానికి అవకాశం కలిగించింది. ఇలా జలాలను ఆయుధాలుగా మార్చటం అత్యంత ప్రమాదకరం. నీటి పారుదలను ఆపటం వలన కరువులు తప్పక వస్తాయి. నీరు, ఆహారం లేకపోతే ప్రజలు నిరాశలో కూరుకొని పోతారు. ఏది దొరికితే అది తిని, తాగుతారు. శుభ్రత లోపించటం, పారిశుధ్య వనరులు లేకపోవటం వలన హింసా, మరణాలు సంభవిస్తాయి. మొత్తంగా దేశపు ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుంది. ఆనకట్టల మీద అదుపు కూడా దిగువ ప్రావాహంలో ఉన్న శత్రువుల పొలాలకు వరదలు కలిగించి, వాటిని నాశం చేస్తుంది. ప్రజలు ఎక్కడ ఉన్నా ప్రజలే. ప్రజలు వేరు, ప్రభుత్వాలు వేరు.   

పేద, మూడో ప్రపంచ దేశాలలో కరువు అంటే పోషకారలోపం, సామూహిక మరణాలే. కరువు వ్యవసాయాన్ని, పశువులను నాశనం చేస్తుంది. ఈ పరిణామాలన్నీ చేయి చేయి పట్టుకొని నడుస్తాయి.    పాకిస్తాన్, ఇండియా వివాదంలో మొదట ప్రమాదంలో పడేది వ్యవసాయం, ప్రజారోగ్యాలు.

పహల్గావ్ దాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కొత్తగా నీళ్లు ఆపేది ఉన్నా లేకపోయినా పర్యవసానాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. అఖండంగా సంభవిస్తున్న పర్యావరణ మార్పుల ప్రభావం కశ్మీరీలను ఆకలికీ, దాహానికి గురి చేస్తున్నాయి. ప్రముఖ దేశాల మధ్య రాజకీయ కక్షలు మరింత ప్రజల సంక్షేమం పట్ల ఏమాత్రం బాధ్యత లేకుండా చేస్తున్నాయి. 

కశ్మీర్ అంతా మనదే, ఇక అక్కడ మనకు ఎదురు లేదని చెప్పే రాజకీయ నాయకులు, బాధ్యతారహితంగా జరుగుతున్న టూరిజం =అక్కడి వాతావరణంలో పెను మార్పులు తెస్తుంది. కశ్మీర్ లో అమర్ నాథ్ యాత్ర పేరుతో రెండు నెలలు జరిగే ప్రహసనం ఎలాంటి పర్యావరణ పరిణామాలకు దారి తీస్తున్నాయో చెప్పే అనేక రిపోర్ట్స్ వచ్చాయి. తులిప్ పూలు పూసే జులైలో లోయ కిక్కిరిసి పోతోంది. 

టూరిజం వలన స్థానిక కశ్మీరీలకు ఉపాధి దొరుకుతున్న మాట నిజమే కానీ -టూరిజం తప్ప ప్రజలకు ఇతర ఉపాధి లేకుండా చేయటం వెనుక కారణాలు కూడా చూడాలి. కశ్మీరీలను ఎంత కాలం షికారిలుగా, గుర్రాలను నడిపేవాళ్లుగా, గైడులుగా, టాక్సీ డ్రైవర్లుగా చూడాలి? అక్కడ చదువుకొన్న నిరుద్యోగులు ఇతర ప్రాంతాల యువకుల లాగా, దేశంలో ఇతర ప్రాంతాలకు వచ్చి పని చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. కశ్మీర్ పర్యావరణాన్ని ఫణంగా పెట్టి అక్కడ ప్రజల్ని బతకనిస్తున్నాం అనటం ఎంత సమంజసమో ఆలోచించాలి. 

ఇంకో పక్క పాకిస్తాన్ వ్యతిరేకతనే ఎన్నికల ఆయుధంగా వాడుకొంటున్న బీజేపీ ఎక్కడికక్కడ ఆనకట్టలు కట్టి పాకిస్తాన్ ను ఎడారిగా మార్చే ప్రయత్నం చేస్తోంది. నీళ్లను ఆయుధంగా వాడటం అనే పద్దతి భవిష్యత్ పరిణామాలను మనం బ్రిటిష్ నుండి దుష్ట వారసత్వంగా అందిపుచ్చుకొని అమలు చేస్తుంది. ఇరుగు పొరుగు దేశాలు సఖ్యంగా సమస్యలను పరిష్కరించుకొంటే ఎన్ని యుద్ధాలను నివారించవద్దు? ఎన్ని ప్రాణాలను కాపాడుకోవచ్చు? ఎంత డబ్బును ప్రజా సంక్షేమానికి వాడుకోవచ్చు

హింస ఒక చోట మొదలైతే దాని ప్రభావం దేశమంతా ఉంటుందని మర్చిపోకూడదు. హింసను ప్రేరేపించే వాళ్లకు దీర్ఘకాలిక దృష్టి ఉంటుంది. ప్రజలు హస్వ దృష్టితో, తాత్కాలిక ఆగ్రహావేశాలతో ప్రవర్తించేటట్లు చేయటం వాళ్లకు తెలుసు. నీటిని అదుపు చేసి పాకిస్తాన్ మీద ఆధిపత్యం సంపాదించుకోవాలను కొంటున్న భారత్ సొంత దేశంలో ఏమాత్రం సురక్షిత తాగు నీటిని అందిస్తుంది? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నీటి పారుదల అవకాలు ఏమాత్రం ఉన్నాయి అని ప్రశ్నించుకొంటే పెదవి విరుపే మిగులుతుంది.  

నదులు వాలును బట్టి ప్రవహిస్తూ ఉంటాయి. వాటి పరీవాహక ప్రాంతాల్లో ప్రజలు సేద తీరటం, అవసరాలు తీర్చుకోవటం, నాగరికతను అభివృద్ధి చేసుకోవటం రాజ్యాలు ఉనికిలో లేనప్పటి నుండీ జరుగుతున్నదే. సంక్షేమ రాజ్యాలు సహజ వనరులను శాస్త్రీయ పద్దతిలో ఆధునికరించి ప్రజా సంక్షేమానికి వినియోగించాలి. ఒక పక్క వనరులను కొల్లగొట్టి కాకులకూ గద్దలకూ వేస్తూ, వాటిపైన జీవిస్తున్న ఆదివాసుల మీద దమనకాండను ప్రయోగిస్తున్నారు. ఇంకో పక్క ఒక జాతిని అణచటానికి, ఒక రాజకీయ ప్రయోజనం నెరవేర్చుకోవటానికి అవే వనరులను ఆయుధాలుగా వాడుతున్నారు. 

రాజ్యాలు వేస్తున్న ఉచ్చుల్లో ప్రజలు పడకుండా నిత్యం జాగృతం చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఉచ్చు పేరు దేశభక్తి కావచ్చు. మత ద్వేషం కావచ్చు. నీళ్ల రాజకీయాలు కావచ్చు.  

(అయిపోయింది)

Comments

Popular posts from this blog

కిమ్ జోంగ్ ఉన్ ఎవరు? ఉత్తర కొరియా పాలకుడు ఎలా అయ్యారు?

Green Party of the United States

Deep state in the United States